నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న అక్షయ్ 'రాక్షసుడు' రీమేక్
on Aug 20, 2022
ఇన్వెస్టిగేటివ్ కాప్గా అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కఠ్పుత్లీ'. ఈరోజు ఆ మూవీ ట్రైలర్ను ముంబైలో అక్షయ్ స్వయంగా ఆవిష్కరించాడు. ఈ మూవీలో అక్షయ్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, సర్గుణ్ మెహతా, చంద్రచూడ్ సింగ్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన విశేషం.. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో సెప్టెంబర్ 2న విడుదలవుతుండటం. డిస్నీప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది.
విష్ణు విశాల్ తమిళంలో నటించగా ఘన విజయం సాధించిన 'రాచ్చసన్'కు ఇది హిందీ రీమేక్. తెలుగులో ఇదే సినిమా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయ్యి, ఇక్కడా మంచి హిట్టయ్యింది. "కసౌలీ అనే హిల్ స్టేషన్లో జరిగే దారుణమైన హత్యల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ మూవీలో పలు మలుపులుంటాయి. వరుసగా హత్యలు చేస్తూ వచ్చే ఒక సైకోపాత్ కిల్లర్ను పట్టుకోవడానికి ప్రయత్నించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటించాను. సినిమాలో క్లైమాక్స్ మనం ఏమాత్రం ఊహించని విధంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది." అని చెప్పాడు అక్షయ్.
రెండోసారి అక్షయ్ కుమార్తో కలిసి పనిచేసే అవకాశం రావడంపై డైరెక్టర్ రంజిత్ ఎం. తివారీ ఆనందం వ్యక్తం చేశాడు. "మర్డర్ మిస్టరీ కేసును ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు, ఈ క్రమంలో అతనేం కోల్పోయాడనేది ఉద్విగ్నభరితమైన కథనంతో తీశాం" అని చెప్పాడు.
Also Read